telugu navyamedia
CBN Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో తెలంగాణ వ్యక్తికీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది.

శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నల్లమల ప్రాంతానికి చెందిన నేతకు ఎట్టకేలకు స్థానం లభించింది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డిని బోర్డు సభ్యుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నియామకం వెనుక అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చేసిన ప్రత్యేక కృషి ఉంది.

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన నాటి నుంచి శ్రీశైలం బోర్డులో తమ ప్రాంతానికి చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో, గత వారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఈ విషయంపై విజ్ఞప్తి చేశారు.

ఆయన అభ్యర్థనను సానుకూలంగా పరిగణించిన సీఎం, సుధాకర్ రెడ్డి నియామకానికి ఆదేశాలు జారీ చేశారు.

ఇక సుధాకర్ రెడ్డి సుదీర్ఘకాలం ఏబీవీపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేసి, ఆ తర్వాత బీజేపీలో చేరారు. తన విజ్ఞప్తి మేరకు తెలంగాణ వ్యక్తికీ అవకాశం కల్పించడం పట్ల వంశీ కృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు, ఈ నియామకానికి సహకరించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కట్టా సుధాకర్ రెడ్డి నియామకంపై బీజేపీ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు గంగిశెట్టి నాగరాజుతో పాటు పలువురు స్థానిక నేతలు అభినందనలు తెలియజేశారు.

Related posts