గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు.
ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు సిద్ధం చేస్తుండగా .. పార్టీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ భవన్ దగ్గర వైవీ ఆంజనేయులు వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కోడెల శివరాం వర్గం తీసేసింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి ప్రయత్నించారు..
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించారు. పార్టీ 40 వసంతాల ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవిష్కరించారు.
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ లోగోను ఆవిష్కించారు. చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించిందన్నారు.
టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు