ఏపీసీఎం చంద్రబాబు ఇరు తెలుగు రాష్ట్రాల టీడీపీ నేతలతో నేడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షత వహిస్తున్న బాబు పలు కీలక అంశాలను సమావేశంలో చర్చకు తేనున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో పొత్తుల నుండి పార్టీ పిటాయింపుల వరకు అనేక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్ర, తెంగాణ రాష్ట్రాల సభ్యులు హాజరుకానున్నారు. సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న ఈ భేటీలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ స్థితిగతులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చసాగనుంది.
ఈ సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి అడుగు వేస్తే ఎలా ఉంటుంది, పార్టీలోకి వలసలు, వీడి వెళ్తున్న వారి అంశాలపై సభ్యులతో చంద్రబాబు చర్చిస్తారని సమాచారం. అసెంబ్లీ టికెట్లు, ఆశావహుల్లో అవకాశం రాని వారికి ఎమ్మెల్సీ టికెట్ల అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారు. పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు, అమరావతిలో నిర్వహించ తలపెట్టిన ధర్మపోరాట సభ వంటి అంశాలన్నింటిపైనా చర్చించనున్నారని పార్టీ వర్గాల సమాచారం.