గాంధీ జయంతి, గ్రామ సచివాలయాల లాంటి ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలతో, విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ పోలీసులు డ్యూటీకి డుమ్మా కొట్టి సినిమాకు వెళ్లారు. పైగా ఎవరికీ సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో ఆ అధికారులపై యాక్షన్ తీసుకున్నారు ఎస్.పి ఫకీరప్ప. కర్నూలు జిల్లాలో పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చేసిన తప్పులు తమ మెడకు ఎప్పుడు చట్టుకుంటాయనే ఆందోళనలో వున్నారు. డ్యూటీకి డుమ్మా కొట్టి సినిమాకు వెళ్లిన 7 గురు ఎస్.ఐ వీఆర్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు ఎస్.పి ఫకీరప్ప. సినిమాకు వెళ్లడమే కాకుండా థియేటర్లో సెల్ఫీ కూడా తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్గా మారింది. డ్యూటీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు ఎస్.ఐలను వీఆర్కు పంపారు.
పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎస్పీ ఫకీరప్ప. ఇంతకుముందు కొసిగి మండలంలో పేకట రాయుళ్లను తప్పించి నకిలీలను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ వ్యవహారం బయటికి రావడంతో.. ఎస్పీ ఫకీరప్ప విచారణ జరిపించి ఎస్.ఐ శ్రీనివాసరావు, ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయించారు. ఆరోపణలు వస్తే కఠినంగా వ్యవహరించి పనిష్ మెంట్ ఇస్తున్నారు. అనేక కారణలతో ఇప్పటి వరకు 20 మందికి పైగా సి.ఐ, ఎస్.ఐలను వీఆర్కు పంపారు. కొందరిని సస్పెండ్ చేశారు ఎస్.పి. ఫకీరప్ప.