అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులు అర్పించారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి చంద్రబాబు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లారు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ఇక లేరు అన్న మాట వినగానే చాలా బాధ కలిగిందని చెప్పారు.
యునైటెడ్ ఫ్రంట్ లో తాను కన్వీనర్ గా, జైపాల్ రెడ్డి అధికార ప్రతినిధిగా కలిసి పనిచేశామని, ఆయన పనితీరు ఎల్లవేళలా స్ఫూర్తిదాయకంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. అంతటి వాగ్ధాటి, సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి ఈ మధ్య కాలంలో మరొకరు లేరని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా రాజీలేని పోరాటం చేసిన నేత జైపాల్ రెడ్డి అని కీర్తించారు.