విశాఖ రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. అమరావతిలో పెండిగ్ పనులపై దృష్టి సారించామని బొత్స చెప్పారు.
చంద్రబాబు గ్రాఫిక్స్ మాదిరి కాకుండా నిజంగా అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అమరావతి రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా అప్పులు తెచ్చుకుంటూ అమరావతిని నిర్మించలేమని స్పష్టం చేశారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రను పోషించడంలో టీడీపీ విఫలమైందని అన్నారు.