పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు
తెలంగాణ విడిపోవడం వల్ల హైదరాబాద్ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని.. గతంలా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచాలని తాము అడిగితే బావుంటుందా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని బొత్స అన్నారు.
పోలవరం ఎత్తు ఎప్పుడూ పెంచలేదని, అది ముందు అనుకున్న డిజైన్ ప్రకారం నిర్మాణం అవుతుందని బొత్స అన్నారు. సీడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా అక్కడ కొత్త ఏమీ జరగడం లేదని వివరణ ఇచ్చారు. విభజన చట్టంలో ఉన్న అంశాలప్రకారమే జరుగుతోందని అన్నారు. ఆ డిజైన్ ప్రకారం భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ప్రస్తుతం భద్రాచలంలో వందేళ్ల చరిత్రలోనే వచ్చిన అధిక వరదలు కాబట్టి, అంతగా అక్కడి ప్రాంతాలు ప్రభావితం అయ్యాయని అన్నారు.
మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి చూసుకోమనండి. మా రాష్ట్రంలో విలీనం అయిన గ్రామాల బాధ్యత పూర్తిగా మాదే. పక్క రాష్ట్రాల గురించి కామెంట్ చేయడం బాధ్యతగల వ్యక్తికి తగదు. మాకు ఒకరు చెప్పాలా? అన్ని విషయాలు మాకు తెలుసు. ఇప్పటికే మా ప్రభుత్వం అన్ని సక్రమమైన పనులు చేస్తూ ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చేస్తున్నామని అన్నారు.
వందేళ్ల తర్వాత.. గోదావరికి ఇంత వరద వచ్చిందన్నారు. ఈ విషయంలో ఎవరైనా బాధ్యతగా మాట్లాడాలని, విలీన ప్రక్రియ కేంద్రం పరిధిలోని అంశమని అన్నారు.
ఒకవేళ పార్లమెంటులో ఆ 5 గ్రామాలను మళ్లీ తెలంగాణలో కలపాలనే బిల్లును తీసుకొస్తే, మళ్లీ రెండు రాష్ట్రాలనీ కలపాలనే డిమాండ్ని మేమూ తీసుకొస్తామని, అందులో తప్పేముంది అని బొత్స కౌంటర్ ఇచ్చారు.