ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ప్రభుత్వం మార్పు చేసింది. సంక్రాంతి తర్వాత ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.అయితే పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేశామని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వెల్లడించారు.
అయితే..రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జనవరి 31 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణీకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చారు.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించకపోతే రూ.100 జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మంత్రి ఆళ్ల నాని కోరారు.
షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద కోవిడ్ రూల్స్ ఉల్లంఘిస్తే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సినిమా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని ఆదేశించింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కులు తప్పనిసరి వేసుకోవాలని తెలిపింది.
రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకు ప్రయత్నాలు: దేవినేని