అమరావతికి భూములిచ్చిన రైతులు ఉద్యమం చేపట్టి 300 రోజులయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. రాజధానిగా అమరావతిని ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి సమర్ధించారని.. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనకు పవిత్ర జలాలు, పార్లమెంటు ఆవరణలోని మట్టి తీసుకొచ్చి అమరావతి మరో ఢిల్లీ కావాలని ఆకాంక్షించారని తెలిపారు.
ఇప్పుడు ఆ రాజధానిని మార్చడం తగదని 300 రోజులుగా రైతులు పిల్లాపాపలతో ఉద్యమం చేయాల్సిరావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. సీఎం, ప్రతిపక్ష నాయకుడు సమర్ధించాక ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మారుస్తామంటే వ్యవస్థలపైనే నమ్మకం పోయే పరిస్థితి ఉందని..ప్రజలు ఇక ఎవరిని నమ్మాలని ఫైర్ అయ్యారు. అమరావతే రాజధాని అని నమ్మి పెట్టుబడులు పెట్టిన యూనివర్సిటీలు, కంపెనీలు, వ్యాపారవేత్తలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏమైపోవాలని ప్రశ్నించారు. రాజధాని విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి మనస్సు చేసుకుని ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు.
previous post