telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్‌ కేసు : ఎలాంటి సంబంధం లేదు… కన్నీరుమున్నీరైన యాంకర్

Anushree

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కుంభకోణంలో ఇక ఈ కేసులో తనకు డ్రగ్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీసీబీ విచారణ చేసినంత మాత్రాన తాను నేరస్తురాలిని కాదని యాంకర్‌ అనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఆవేదనతో కూడిన వీడియోను అప్‌లోడ్‌ చేశారు. తనకు తెలిసిన మేరకు సీసీబీ అధికారులకు వివరాలు అందించా, తాను ఎలాంటి తప్పు చేయలేదని కన్నీరు మున్నీరయ్యారు. ఇక ఇప్పటికే అరెస్ట్‌ చేసిన నిందితుల రక్తం, వెంట్రుకలు, మొబైల్‌ ఫోన్లను హైదరాబాద్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపామని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవని, కేసు విచారణకు ఆటంకం కలగలేదన్నారు. విదేశీ పెడ్లర్లతో నటీమణులు రాగిణి, సంజన గల్రానిలకు చాటింగ్‌ చేసినట్లు సీసీబీ ఆధారాలు సేకరించింది. వీరు లూమ్‌ సెప్పర్‌ నుంచి నేరుగా డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. కొనుగోలు చేసిన డ్రగ్స్‌తో బెంగళూరు శివారులోని ఫామ్‌ హౌస్‌లలో పార్టీలు ఏర్పాటు చేసినట్లు సాక్ష్యాలు లభించాయి. ఇదే కేసులో సీసీబీకి సహకరించని నిందితుడు వీరేన్‌ ఖన్నాకు నార్కోటెస్ట్‌ నిర్వహించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈమేరకు కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. నార్కోటెస్ట్‌లను నిర్వహించటానికి అహమ్మదాబాద్‌ లేదా హైదరాబాద్‌కు ఖన్నాను తీసుకెళ్లాలని సీసీబీ నిర్ణయించింది. అయితే నార్కోటెస్ట్‌కు వీరేన్‌ ఖన్నా అంగీకరించలేదని తెలుస్తోంది. ఖన్నా నివాసం ఉన్న ఫ్లాట్స్‌పై సీసీబీ దాడి చేసి పోలీస్‌ యూనిఫామ్, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఐఎస్‌డీ పోలీసులు ఇద్దరు పెడ్లర్స్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బుల్లితెర నటీనటులతో పాటు లేడీరౌడీ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఐఎస్‌డీ పోలీసులు లేడీరౌడీ కోసం గాలిస్తున్నారు. ఆమెపై నగరంలో పలు పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts