నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు ‘వారసుడు’గా వచ్చినప్పటికీ టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ని సృష్టించుకున్నాడు మన్మదుడు నాగార్జున. అమ్మాయిల కలల రాకుమారుడు..రొమాంటిక్ హీరో..అభిమానుల మనస్సులు దోచుకోవడంలో టాలీవుడ్ నవ మన్మథుడిగా వెలిగిపోతున్నాడు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, రియాల్టీషో వ్యాఖ్యాతగా తన సత్తా చాటిన నాగ్ నేడు 62వ పడిలోకి అడుగుపెడుతున్నారు.
అక్కినేని నాగార్జునకు పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్…
ప్రముఖ నటుడు నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు తమిళనాడులోని చెన్నైలో జన్మించారు నాగార్జున. తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రంలోనే నిర్మించాలనే ఉద్దేశ్యంతో అక్కినేని తొలిగా హైదరాబాద్కి తరలివచ్చారు. దాంతో.. నాగార్జున విద్యాబ్యాసం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో నాగ్ చదువుకున్నారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బీ.ఎస్. చేశారు.
ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుడిగుండాలు’ సినిమాలో బాలనటుడిగా కనిపించారు నాగ్. అంతకు ముందు ‘వెలుగు నీడలు’ అనే సినిమాలో పసిపిల్లాడిగానే స్కీన్ర్పై మెరిశారు. ఈ రెండు సినిమాలలో హీరో అక్కినేని నాగేశ్వరరావు కావడం విశేషం. ఆ తర్వాత కొన్నేళ్లకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించిన ‘విక్రమ్’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసారు.
హిందీలో వచ్చిన ‘హీరో’ సినిమాకు ఈ చిత్రం రీమేక్. ఈ సినిమా మంచి విజయమందుకొని నాగ్కి ఓ మంచి స్టార్ట్ ఇచ్చింది. ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మజ్ను లాంటి విషాద కావ్యాన్ని టాలీవుడ్కు అందించి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇలా ‘ఆఖరి పోరాటం’, ‘జానకి రాముుడు’తో తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు నాగార్జున.
అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం కూడా లేని ఓ పాతికేళ్ల కుర్రాడికి డైరెక్టర్గా అవకాశమివ్వడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఆ కుర్ర దర్శకుడే రామ్గోపాల్ వర్మ. వీరిద్దరూ తీసిన ‘శివ’ టాలీవుడ్లో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే.
భక్తి చిత్రాలకు కమర్షియల్ సినిమాల స్థాయి కలెక్షన్లు రప్పించడం నాగార్జునకే చెల్లింది. ‘ఘరానా బుల్లోడు’, ‘నిన్నే పెళ్లాడుతా’ లాంటి సూపర్ హిట్లు తీసిన తర్వాత ‘అన్నమయ్య’ ‘శ్రీరామదాసుస ‘ఓం నమో వెంకటేశాయస లాంటి భక్తిరస చిత్రాన్ని ఎంచుకోవడం కూడా ఓ సాహసమే అని చెప్పాలి.
ఓ వైపు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే వైవిధ్యమైన పాత్రలు, సినిమాల కోసం పరితపించే అగ్రహీరోల్లో నాగ్ కచ్చితంగా ముందుంటారు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన ‘మనం’ సినిమా బ్లాక్ బాస్టర్ ఫామిలీ డ్రామాగా నిలిచింది. డ్యుయల్ రోల్స్లో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.
పురస్కారాలు:-
* ‘నిన్నే పెళ్ళాడతా’ చిత్రానికి ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు’ కేటగిరీలో నిర్మాతగా, ‘అన్నమయ్య’ సినిమాకు స్పెషల్ మెన్షన్ – యాక్టర్ కేటగిరీకిగానూ జాతీయ చిత్ర పురస్కారాలను అందుకున్నారు నాగ్.
* ఉత్తమ నటుడిగా.. ‘అన్నమయ్య’, ‘సంతోషం’, ‘శ్రీరామదాసు’, ‘రాజన్న’ చిత్రాలకు నంది బహుమతిని అందుకున్నారు.
* ఉత్తమ నిర్మాతగా.. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ప్రేమ కథ’, ‘యువకుడు’, ‘రాజన్న’ సినిమాలుకు పలు అవార్డులను అందుకున్నారు. ఇలా మరెన్నో పురస్కారాలను అందుకున్నారు కింగ్ నాగార్జున.
వెండితెరపై ఎన్నో హిట్లిచ్చిన నాగార్జున.. బుల్లితెరపైనా తనదైన ముద్రవేశారు. తొలిసారి ఆయనే నిర్మించిన ‘యువ’ అనే సీరియల్లో మెరిసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీలో పాపులర్ రియాలిటీ షో అయినా ‘కౌన్ బనేగా కరోడ్పతి’ తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’గా తీసుకొచ్చారు షో నిర్వాహకులు.
ఆ కార్యక్రమాన్ని తనదైన స్టైల్ జోడించి రక్తి కట్టించారు. ఆ తర్వాత ‘బిగ్బాస్’కి కూడా హోస్ట్ గా చేసి మెప్పించారాయన. త్వరలోనే బిగ్బాస్ కొత్త సీజన్ ఆరంభం కానుంది. ఈ రియాలిటీ షోలతో బుల్లితెరపైనా అభిమానులను సంపాదించుకున్నారాయన.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ’ది ఘోస్ట్’ మూవీలో నటిస్తుండగా, కల్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ‘బంగార్రాజు’గా మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు నాగ్. హిందీలో ‘బ్రహ్మస్త్ర’లోనూ నటిస్తున్నారు. నాగ్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ… ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
అందుకే సినిమాలు చేయనన్నాను – టబు