కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కన్నడ నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను గత నెల 20న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు నటీనటులు, మోడల్స్ పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటి రాగిణి ద్వివేదికి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేయడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈరోజు రాత్రిలోగా సీసీబీ విచారణకు హాజరు కావాలంటూ రాగిణిని ఆదేశించారు. మరో వైపు ఈ కేసులో ఇప్పటికే రాగిణి స్నేహితుడు రవిని సీసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో రాగిణికి కూడా సంబంధాలు ఉన్నట్టు రవి విచారణలో సంకేతాలు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెకు సమన్లు జారీ అయ్యాయి. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ ఆత్మహత్య కేసులో కూడా డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో బాలీవుడ్ లో కూడా ప్రకంపనలు మొదలయ్యాయి. ఇక టాలీవుడ్ లోనూ డ్రగ్స్ లేనిదే పార్టీలు జరగవు అంటూ నటి మాధవీలత బాంబు పేల్చిన విషయం విదితమే.