పీరియాడికల్ చిత్రం ‘పానిపట్టు’ చిత్రంలో అర్జున్ కపూర్, సంజయ్ దత్, మోహ్నిష్ బహ్ల, పద్మని కోల్హాపూర్, జీనట్ అమాన్, కృతిసన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతికి అవకాశం రావడంపై ఆమె మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం రావడం అనేది ఓ సర్ప్రైజ్ అని కానీ ఈ సినిమాలో చేసే ఛాన్స్ అనేది ఓ కొత్త అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఇది ప్రేక్షకులకు చెప్పాల్సిన గొప్ప కథ. నేను ఇందులో పార్వతి బాయి పాత్రలో నటిస్తున్నా. ఈ పాత్రను అశుతోష్ రాసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేస్తానని అనుకోలేదు. అందుకే ఈ క్యారెక్టర్ నన్ను ఆకర్షించింది.
నేను ఉత్తరాదికి చెందిన పంజాబీ అమ్మాయినీ అయినా… మరాఠి అమ్మాయి పాత్రను నాతోనే చేయించాలనే ఆలోచన ఈ దర్శకుడికి ఎలా వచ్చింది.. అన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదంటుంది కృతి. ఈ క్యారెక్టర్ నాకు దక్కడం ఆశ్చర్యం కలిగించింది. అదీ లెజెండ్ దర్శకుడు చేసే సినిమాలో రావడం అనేది మరో ఆశ్చర్యం. ఈ అవకాశం పూర్తిగా విభిన్నమైంది. నా కెరీర్లో ఇప్పటివరకూ చేయనది. ఈ పాత్ర చేయడం అంటే సవాల్తో కూడుకున్నది. నేను పెట్టుకున్న కొన్ని హద్దులను ఈ క్యారెక్టర్ చెరిపేస్తుంది” అని తెలిపారు. ఈ చిత్రాన్ని సునీత గోవారికర్, రోహిత్ శేఖర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.