పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ను మరికొద్ది గంటల్లో భారత్కు చేరుకోనున్నారు. అభినందన్ను భారత్ వైమానిక దళం స్వాగతం పలుకనుంది. అభినందన్ రాక కోసం కుటుంబసభ్యులు ఇప్పటికే వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. ఇటీవల పాక్ యుద్ధ విమానాలు భారత్ గగనతలంలోకి ప్రవేశించిన విషయాన్ని గమనించిన అభినందన్ మిగ్ విమానంతో పాక్ విమానాన్ని వెంటాడాడు. ఈ సందర్భంగా పాక్కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది.
ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు పాక్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ అభినందన్ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే అభినందన్ కు స్వాగతం పలికేందుకు అతని తల్లిదండ్రులు వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. అభినందన్ను చూసేందుకు వందలాది మంది వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. అభినందన్ రాక కోసం దేశ ప్రజలందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.