ఎన్నికలు దగ్గరపడేకొద్దీ నాయకులకు మరియు పార్టీలకు రైతులు గుర్తుకువస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉన్న బీజేపీ రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా, తెలంగాణాలో ప్రవేశపెట్టి, విజయవంతంగా నడుస్తున్న రైతు బందు పథకాన్ని ఇంకాస్త మెరుగ్గా రూపొందించి, జాతీయంగా అమలు చేయాలనీ కేంద్రప్రభుత్వం భావిస్తోంది. జాతీయంగా ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం తరహాలో ఓ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అందిస్తున్న ఎరువుల రాయితీతో పాటు అన్ని వ్యవసాయ సబ్సిడీలకు బదులుగా రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమచేసి వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మోదీ సర్కారు ప్రణాళిక రచిస్తున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ బ్లూమ్బర్గ్ తన నివేదికలో వెల్లడించింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి రూ.70 వేల కోట్ల అదనపు భారం పడనున్నట్లు తెలిపింది.
మూడు రాష్ట్రాల(మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్) అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలైన నేపథ్యంలో వస్తుసేవలపై పలు పన్ను మినహాయింపులు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే వార్షిక బడ్జెట్ లోటును అధిగమించింది. అయినప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా రైతులను ప్రసన్నం చేసుకోవడానికి భారీ నిధులతో కొత్త పథకాన్ని తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతోపాటు పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో రుణ మాఫీ కోసం దేశవ్యాప్తంగా రైతన్నలు నిరసనల బాట పట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ర్టాలలో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ర్టాలలో రైతులకు రుణమాఫీ చేయడం ద్వారా కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తిలో ఉన్న రైతన్నల అభిమానం చూరగొనేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని తెరపైకి తెస్తున్నట్టు సమాచారం.
స్టాలిన్ షాక్ తో కేసీఆర్ కు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్: విజయశాంతి