సభలో ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా బదులివ్వాలని బీజేపీ సభ్యులకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించారు. ఈ ఉదయం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్ నాథ్ ఆ పార్టీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీని చొరబాటుదారు అని, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను నిర్బల (బలహీన) అని విపక్షాలు విమర్శించడం పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.
ప్రతిపక్షాల విమర్శలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, వాటికి దీటుగా బదులివ్వాల్సిందేనని సూచించారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ మర్యాదకు భంగం కలిగే వ్యాఖ్యలు కానీ, అసభ్యకర పదజాలం కానీ ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సభామర్యాదకు లోబడి ఉండాలని అన్నారు. విపక్షాలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను గట్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మీరు ఉపయోగించే భాష చాలా సభ్యతతో కూడి ఉండాలి అంటూ సూచించారు.