మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కలెక్టర్లు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 31న హైకోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు.
మీర్పేట కార్పొరేషన్లో వార్డుల విభజన జరగకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదన్నారు. మొత్తం 3,103 వార్డుల్లో ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు వెల్లడించారు. 8,056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటిలో అభ్యర్థి ఖర్చు రూ. లక్ష, కార్పొరేషన్లో అభ్యర్థి ఖర్చు రూ. లక్షా 50 వేలు మించకుండా ఉండాలన్నారు.