దేశంలో చలానాల మోత మోగిపోతుంది. నిజంగా కట్టేవాళ్ళు ఉంటె, దేశ ఆర్థిక స్థితి మరో ఏడాదిలోగానే బాగుపడుతుంది.. అన్న రీతిలో భారీగా బాదేస్తున్నారు ట్రాఫిక్ వాళ్ళు. వాహనదారులు కట్టగలరా లేదా అనేది పక్కనపెడితే, తాజాగా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడని భువనేశ్వర్ కు చెందిన దిలీప్ కర్తా అనే డ్రైవర్ కు 6.53 లక్షల జరిమానా విధించారు. ఈ డ్రైవర్ మొత్తం ఏడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడని తెలుస్తోంది. ఏడు నిబంధనలు ఉల్లంఘించటంతో సాంబాల్ పూర్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో చలానా జారీ చేసారని తెలుస్తోంది. గడచిన ఐదు సంవత్సరాల నుండి రోడ్డు ట్యాక్స్ కట్టని కారణంతో 6,40,500 రుపాయలు జరిమానా వేసారని తెలుస్తోంది.
రోడ్డు ట్యాక్స్ మాత్రమే కాకుండా వస్తువులను మాత్రమే తరలించాల్సిన వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోవటం, తప్పు చేసినప్పటికీ తప్పను అంగీకరించకపోవటం వలన జరిమానా 6.53 లక్షలు అయిందని తెలుస్తోంది. ఆగస్టు నెల 10 వ తేదీన వేసిన జరిమానా, అదే కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత విధించి ఉంటే మాత్రం ట్రక్కు యజమానికి జరిమానా ఇంకా భారీగా పెరిగేదని చెప్పవచ్చు. కొత్త చట్టం అమలు విషయంలో చాలా రాష్ట్రాలు వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ రాష్ట్రంలో జరిమానాలను సగానికి సగం తగ్గించటం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు ఉండటం వలన కొత్త మోటారు వాహనాల చట్టంను అమలు చేయలేమని ఆ రాష్ట్రాలు కేంద్రానికి చెబుతున్నట్లు తెలుస్తోంది.