కంప్యూటర్ సేల్స్ కంపెనీలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తమిళనాడులోని మధురైలో ఆసియాన్ కంప్యూటర్ సేల్స్ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పరిసరప్రాంత ప్రజలు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని, 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశాయి.
ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్లతో పాటు వాటి పరికరాలు పూర్తిగా కాలిపోయినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమీపంలో ఉన్న భవనాలకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు నానా ఇబ్బందులకు గురయ్యారు.