గత కొన్ని రోజులుగా ముంబైలో మళ్లీ వానలు కుండపోతగా కురుస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లుపై నిలిచిన నీటిలో ముందుకు కదిలేందుకు లగ్జరీ కార్లు సైతం మొరాయించాయి. ఓ మెర్సిడెస్ బెంజ్ కారు రోడ్లుపై వరద నీటిలో చిక్కుకుపోయి ముందుకు కదలకుండా మొరాయిస్తున్న వీడియోను బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అర్జున్ షేర్ చేసిన ఆ వీడియోలో బెంజ్కారు మొరాయిస్తుండగా, ఆ వెనకే ఓ ఆల్టోకారు రయ్మంటూ ముందుకు దూసుకుపోయింది. ఈ వీడియోను పోస్టు చేసిన రాంపాల్.. ‘‘నీట మునిగిన ముంబై రోడ్లపై భారత కార్లు మాత్రమే ప్రయాణించగలవు. కేవలం ఇండియన్ కార్లనే వాడండి’’ అని కామెంట్ రాశాడు. ఇది చూసిన నెటిజన్లు రాంపాల్పై మండిపడ్డారు. “నీతులు చెప్పడం కాదు బ్రో.. నువ్వు కూడా రేంజ్ రోవర్ వాడడం మానేసి మారుతి ఆల్టో కొనుక్కో” అని మండిపడ్డారు. దీనికి రాంపాల్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను వీడియో తీసింది ఆల్టో కారు నుంచే’’ అని బదులిచ్చి తనను విమర్శించిన వాళ్ల నోరు మూయించాడు.
previous post