భారత సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమైనవని పవన్ కళ్యాణ్ అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు.
పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తుండగా… ఇప్పుడు హైదరాబాద్కు ఆ నిరసన సెగ తగిలింది. అగ్నిపథ్ను రద్దు చేయాలంటూ సికింద్రాబాద్లో చేసిన ఆందోళనలు… తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. రైల్వేస్టేషన్లో బీభత్సం సృష్టించిన నిరసనకారులు… రైలుబోగిలకు నిప్పంటించారు. స్టేషన్ పరిసరాల్లోని దుకాణాలను ధ్వంసం చేయడంతోపాటు… బయట ఉన్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపగా… ఒకరు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆందోళనలో మృతిచెందిన వ్యక్తి వరంగల్ జిల్లావాసి దామోదర్ రాకేశ్గా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డ్కి వెళ్లి అక్కడి నుంచి రైల్వేస్టేషన్కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఆందోళనకారులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.