*’దావూద్’ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్..
*ఏడుగంటలు విచారణ తరువాత అదుపులోకి తీసుకున్న ఈడీ..
*దావూడ్ ఇబ్రహీం మనీలాండరింగ్ కేసులో అరెస్ట్
*ఈడీ కార్యాలయం ఎదుట ఎన్సీపీ కార్యకర్తలు ఆందోళన
దావూద్ ఇబ్రహీం, అండర్వరల్డ్ డాన్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి , ఎన్సిపి నేత నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్టు చేసింది. ఆయనను ఏడు గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అనంతరం అరెస్టుపై ప్రకటన చేశారు. విచారణకు నవాబ్ మాలిక్ సహకరించటం లేదని.. అందుకే అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈడీ నవాబ్ మాలిక్ను ప్రశ్నించింది. అరెస్టు తర్వాత, నవాబ్ మాలిక్ సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా “లదేంగే ఔర్ జీతేంగే (పోరాడి గెలుస్తాను)” అని మంత్రి అన్నారు.
అండర్వరల్డ్ డాన్ దావూద్ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్ సోదరుడు ఇబ్రహిం కస్కర్తో సహా పలు అనుమానిత నిందితులతో సంబంధాలపై ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి.
దీంతో దావూద్కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రహిం కస్కర్ను అరెస్ట్ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్ మాలిక్కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
నవాబ్ మాలిక్ను అరెస్ట్ నేపథ్యంలో ముంబయిలోని ఈడీ కార్యాలయం ఎదుట ఎన్సీపీ కార్యకర్తలు అరెస్ట్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.