కర్ణాటకలోని బీదర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులంతా హైదరాబాద్ బేగంపేట వాసులని, ఒకే కుటుంబానికి చెందినవారని గుర్తించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 45 ఏళ్ల గిరిధర్, 30ఏళ్ల అనిత, 15 ఏళ్ల ప్రియ, రెండేళ్ల వయసున్న మహేష్తో పాటు.. డ్రైవర్ జగదీష్ ప్రమాదంలో మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన జిల్లా ఆసుపత్రిలో చేరారు.
కర్ణాటక కలబురిగి జిల్లా గాన్గాపూర్కు కారులో దత్తాత్రేయ ఆలయ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.