మెగాస్టార్ చిరంజీవి వల్లే తాము ఓడిపోయామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైతన్యరథం పేర టీడీపీ పెట్టిన ఈ – పేపరును ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమంటూ చంద్రబాబు అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నారన్నారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమని చంద్రబాబు స్పష్టంచేశారు. సినిమా టికెట్లపై మాట్లాడే ముఖ్యమంత్రి భవన నిర్మాణంపై ఎందుకు మాట్లాడరన్నారు.
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదంలోకి కూడా తెలుగుదేశం పార్టీని ఎందుకు లాగుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ ఏ రోజు కూడా టీడీపీకి సహకరించలేదని , తాను సిఎంగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారని ఆయన అన్నారు..
నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ రోజు రాష్ట్రంలో సంతోషంగా సంక్రాంతి జరుపుకునే పరిస్థితి లేదంటూ పేర్కొన్నారు. కుప్పంలో 250 అక్రమ క్వారీలు నడుస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. సిబిఐ, ఈడీ కేసులను ఐటి క్లియరెన్స్ చేస్తే.. రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు.
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉందని తెలిపారు. ఊరుపేరు లేని వాళ్ళు కూడా తన మీద బాంబులు వేస్తానని అంటున్నారని.. ఇదేనా పాలన అంటూ ప్రశ్నించారు. కుప్పంలో అక్రమ మైనింగ్ చేసే భరత్ అనే వ్యక్తి కి ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. అక్రమ మైనింగ్ జరగలేదని విజయనగరం నుంచి ఒక మంత్రి వచ్చి సర్టిఫికెట్ ఇస్తున్నాడంటూ విమర్శించారు.
కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే విధంగా చైతన్యరథం పనిచేస్తుందని ఆయన చెప్పారు.స్వతంత్రంగా పనిచేసే మీడియా మీద వైసీపీ ప్రభుత్వం వేటు వేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 60 శాతం మంది ప్రజలు సోషల్ మీడియాలకు అలవాటు పడ్డారని ఆయన చెప్పారు. సొంతూరు విశేషాలు రియల్ టైమ్ లో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు తెలిపారు. టీడీపీకి ఉన్న 70 లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసే విధంగా చైతన్య రథం ఈ – పేపర్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.
కొంత మంది ఎలక్ట్రానిక్ మీడియాను కూడా పెట్టుకున్నారని, కానీ టీడీపీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా పేపర్ పెట్టాలని, టీవీ పెట్టాలనే ఆలోచన చేయలేదని చెపపారు. మీడియా వాళ్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారనే ఉద్దేశమే దానికి కారణమని చెప్పారు. మీడియా వాళ్లు వాళ్ల పని వాళ్లు చేస్తారని, రాజకీయాల్లో తమ పని తాము చేయాలని అన్నారు.
కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: జీవన్రెడ్డి