అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 71వ గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. ఇటీవల మంత్రి మండలిలో ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు.
పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ పాలన కర్నూలు నుంచి, చట్ట సభలను అమరావతిలో ఉంచాలని నిర్ణయించిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి బిశ్వభూషణ్ వివరించారు. జగనన్న అమ్మ ఒడితో 100శాతం అక్షరాస్యత సాధించేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషను అలాగే కొనసాగిస్తూ, ఆంగ్ల మాధ్యమంలో బోధన రూపకల్పన చేసిందని చెప్పారు.