తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల పాటు విద్యుత్ కోతలు అమలు అవుతాయని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రకటించింది. ఒడిశాలోని తాల్చేరు నుండి దక్షిణాదిన కోలార్ వరకూ 500 కేవీ హెచ్వీడీసీ లైన్లకు గురువారం నుండి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తయితే దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య సమన్వయం సాధ్యం అవుతుంది. దీని కోసం నార్త్, ఈస్ట్, వెస్ట్ గ్రిడ్ (న్యూ గ్రిడ్)తో అనుసంధానం చేసే పనిని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్) చేపట్టింది.
ఈ విద్యుత్ సరఫరా నిలిపివేత ఫిబ్రవరి 6వ తేదీ వరకూ ఉంటుందని ట్రాన్స్కో గ్రిడ్ ఆపరేషన్ డైరక్టరు నర్సింగరావు తెలిపారు. లైన్ల నిర్వహణలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాలేచరు నుండి దక్షిణాది రాష్ట్రాలకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సరఫరా చేసే 2 వేల మెగావాట్ల విద్యుత్కు ఈ కారిడారే కీలకంగా ఉంది. ఈనేపథ్యంలో గ్రిడ్ రక్షణ కోసం కొత్త గ్రిడ్ (ఉత్తరం, తూర్పు, పశ్చిమం) విద్యుత్ సరఫరా పైనా నేషనల్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) ఆంక్షలు విధించింది. ఆ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోనూ ఆరో తేదీ వరకూ విద్యుత్ సరఫరా సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు ప్రజలు సహకరించాలని నర్సింగరావు కోరారు.
తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్