హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బిల్డింగ్పై నుంచి కిందపడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే చిన్నారి ఎలా చనిపోయిందనే దానిపై మిస్టరీ నెలకొంది.
వివరాల్లోకి వెళితే..
బాలిక కుటుంబం మధురానగర్లో నివాసం ఉంటున్నారు. బాలిక మన్సూరాబాద్లోని ఓ పాఠశాలలో చదువుతుంది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బాలిక సమీపంలోని దుకాణానికి వెళ్తున్నానని ఇంట్లో నుంచి బయటకు వచ్చింది.
అయితే బాలిక ఆటోలో చంద్రపురి కాలనీకి చేరుకుంది. అక్కడ ఒక భవనం లోపలికి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికి భవనం పైనుంచి పడి బాలిక మృతిచెందింది. ఇది గమనించిన బిల్డింగ్ వాచ్మెన్, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. బాలిక ఇంటి నుంచి ఆటోరిక్షాలో చంద్రపురి కాలనీలోని భవనం వద్దకు చేరుకున్నట్టుగా గుర్తించారు. ఆ ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే బిల్డింగ్ వాచ్మెన్, బాలిక కుటుంబ సభ్యుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక అసలు బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లింది? ఎలా పడిపోయింది అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.