కశ్మీర్ పోలీసులు ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులపై భారీ రివార్డులను ప్రకటించారు. డోడా జిల్లాకు చెందిన హరూన్ అబ్బాస్ వానీ, మసూద్ అహ్మద్ ప్రస్తుతం ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిదీన్లో పనిచేస్తున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియజేసినా రూ.15లక్షల బహుమానంగా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు పోస్టర్లు అంటించారు. డోడా జిల్లాను దశాబ్దం క్రితమే ఉగ్రవాదరహిత జిల్లాగా ప్రకటించారు. అప్పటి నుంచి జిల్లాలో ఎలాంటి ఉగ్రదాడులు జరగలేదు. తాజాగా వీరివురు భారీ దాడులకు కుట్రపన్నుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన దళాలు వీరిని ఎలాగైనా పట్టుకోవాలని వ్యూహరచనన చేస్తున్నాయి. అందులో భాగంగానే రివార్డు ప్రకటించినట్లు తెలుస్తోంది.
హరూన్ అబ్బాస్ వానీ 2018 సెప్టెంబరులో ఉగ్రవాదంలో చేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన అతడిని కొంతమంది ముష్కరులు ప్రేరేపించడంతో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. కుటుంబ సభ్యులు అతని చేరికపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అతని తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో వెంటనే తిరిగి రావాలని అప్పట్లో విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులకు సేవ చేయడం కంటే పెద్ద జిహాద్ ఏమీ ఉండదని మీడియా ద్వారా అతనికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఉగ్రవాదం నుంచి తిరిగి వస్తే ప్రభుత్వం తరఫు నుంచి కూడా సాయం అందజేస్తాని పోలీసులు ప్రకటించారు. అయినా లాభం లేకపోవడంతో తాజాగా వారిపై రివార్డు ప్రకటించారు. దెస్సా గ్రామానికి చెందిన మరో ఉగ్రవాది మహ్మద్ అహ్మద్ ఐదు నెలల క్రితం ఉగ్రవాదంలో చేరాడు.