telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బీజేపీ ఇచ్చిన ఆ ఇంటి తాళాలు చేతికి రాలేదు : చిన్మయి

Chinmayi

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద… దాదాపు ఏడాదిగా మీటూ అంటూ పోరాటం చేస్తోంది. తమిళ లిరిసిస్ట్ వైరాముత్తు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని గతేడాది చిన్మయి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో ఫలితంగా చిన్మయిని వెంటనే డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించేశారు. వైరాముత్తును ఎవ్వరూ నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. కాగా… వైరాముత్తుని అవమానించాలని బీజేపీ చిన్మయిని రెచ్చగొట్టిందట. ఇలా చేస్తే ఇల్లు కూడా ఇస్తామని చెప్పినట్లు ప్రముఖ తమిళ మ్యాగజైన్ నఖీరన్ ఓసారి వార్త రాసింది. దీనిపై తాజాగా చిన్మయి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘గతేడాది నఖీరన్ మ్యాగజైన్ నా గురించి నోటి కొచ్చినట్లు రాసేసింది. వైరాముత్తును అవమానిస్తే బెంగళూరులో ఇల్లు ఇస్తామని బీజేపీ నాతో ఒప్పందం కుదుర్చుకుందట. అందుకే నేను ఆయనపై లైంగిక ఆరోపణలు చేశానట. నాకు ఇంతవరకు ఆ ఇంటి తాళాలు చేతికి రాలేదు. నకీరణ్ మ్యాగజైన్ ఆ ఇంటి ఫొటోలు కూడా ప్రచురించింది. అడ్రెస్ కూడా తెలిసే ఉంటుంది. వైరాముత్తుపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఏడాది అవుతోంది. నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించి ఏడాది అవుతోంది. ఏడాది నుంచి విచారణ జరుగుతూనే ఉంది’ అని వెల్లడించారు. ఈ ట్వీట్ చదివిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘మరి ఇన్నాళ్లూ ఎందుకు మ్యాగజైన్‌పై పరువు నష్టం దావా వేయలేదు’ అని అడిగాడు. ఇందుకు చిన్మయి స్పందిస్తూ.. ‘నకీరణ్ మ్యాగజైన్‌కు చాలా మంది జర్నలిస్ట్‌ల నుంచి సపోర్ట్ ఉంది. నేను కేసు వేసినా కూడా ఎంతైనా చెల్లించగల డబ్బు కూడా ఉంది. కానీ నా వద్ద లేదు’ అని తెలిపారు.

Related posts