అదానీగ్రూప్ పలు కీలక రంగాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది. తాజాగా విమానయానరంగంలోకి ప్రవేశించనుంది. ప్రభుత్వం ఇటీవలే విమానాశ్రయాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అదానీగ్రూప్ సంస్థ ‘అదానీ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్’ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆరు విమానాశ్రయాలను 50ఏళ్లపాటు కాంట్రాక్టునకు దక్కించుకుంది. వీటిలో అహ్మాదాబాద్, లఖ్నవూ, జైపూర్, గువహాటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రాయాలు ఉన్నాయి.
ఈ విమానాశ్రయాల నిర్వహణ, ప్రచారం కార్యక్రమాలు, అభివృద్ధి, నిర్మాణం, నూతన ఆకృతులకు రూపకల్పన చేయటం, విస్తరణ తదితర అంశాలకు సంబంధించి తన కార్యకలాపాలను ఇకపై సాగించనుంది. ఈ ఆరు విమానాశ్రయాలు సంవత్సరానికి సూమారు 30 మిలియన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. గుజరాత్లోని అహ్మాదాబాద్ నగరంలో ఈ సంస్థను రిజిష్టర్ ఆఫ్ కంపెనీస్లో ఆగస్టు 2న రిజిష్టర్ చేసుకోగా, రెగ్యులేటరీ ఫైలింగ్కు సంబంధించిన పనులను శనివారం ముంబయి స్టాక్ఎక్చేంజీ వద్ద ముగించింది. ఈ సంస్థ దేశీయంగానే కాక అంతర్జాతీయ విమానాశ్రయాలలో కూడా తన వ్యాపారకార్యకలాపాలను ప్రారంభించనుంది.