కేంద్ర ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘించి ఏపీ సీఎం చంద్రబాబు అప్పులు చేశారని వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పులను ఎవరికోసం, ఎందుకు చేశారో చంద్రబాబు చెప్పలేదని ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా సొంత ఆస్తులను పెంచుకునేందుకే చంద్రబాబు ఐదేళ్లు పనిచేశారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం టీడీపీ ప్రభుత్వ అవినీతిని బయటకు తీస్తుంటే తప్పేముందని ప్రశ్నించారు.రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఏపీ మరింతగా దిగజారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీ అప్పులు ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.