పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మత ప్రాతిపదికన ఈ చట్టం పౌరసత్వం కల్పిస్తోందంటూ ప్రజలు, విద్యార్థులు, విపక్షాలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల మత సామరస్యం దెబ్బతింటుందన్నారు.
ఈ చట్టాన్ని కేవలం మైనారిటీలు మాత్రమే వ్యతిరేకించడం లేదనీ.. దేశ సమైక్యత, అభివృద్ధిని గురించి ఆలోచిస్తున్న వారంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. సీఏఏ కింద కొన్ని పొరుగు దేశాల శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీలంక నుంచి వచ్చే శరణార్థులకు ఈ అవకాశం కల్పించరా? అని పవార్ ప్రశ్నించారు. సీఏఏ, ఎన్నార్సీ పేరుతో దేశంలో నెలకొన్న తీవ్రమైన సమస్యల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు.