“క్షణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడివిశేష్. లిమిటెడ్ బడ్జెట్లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు మరోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేషన్లో “ఎవరు” అనే థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, రెజీనా కసండ్ర హీరోయిన్గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన ప్రీ లుక్ లో అడివి శేష్ విక్రమ్ వసుదేవ్ బ్యాడ్జ్తో కన్పించాడు. ఇక ఇటీవలే విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను నాని చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “అసలు చూస్తుంది తెలుగు సినిమానా? ఇంగ్లీష్ సినిమానా? అనిపించేలా “ఎవరు” ట్రైలర్ ఉంది. సినిమా అంత గ్రిప్పింగ్గా ఉంది. “గూఢచారి” ట్రైలర్ను ఇదే ప్లేస్లో రిలీజ్ చేశాం. “ఎవరు” సినిమాను రిలీజ్ చేయాలని శేష్ అడగ్గానే నేను బాధ్యతగా ఫీలై వచ్చాను. అయితే “గూఢచారి” ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయిపోతే ప్రతి సినిమా ట్రైలర్ని నేనే రిలీజ్ చేయాల్సి వస్తుందనే డేంజర్ ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీజర్ చూసినప్పుడే సినిమాపై ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చారు నాని.
previous post