తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ, భువనగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పెద్దపల్లి, జహీరాబాద్ స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. మైనార్టీలు, క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు.
రాహుల్ ప్రకటించిన నెలకు రూ.6 వేల పథకం పూర్తిస్థాయిలో ప్రజల్లోకి చేరలేదన్నారు. ఒకవేళ చేరీ ఉంటే మరింత మెరుగైన పలితాలు వచ్చేవని విశ్లేషించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేశారని ఆరోపించారు. అవినీతి జరగని శాఖ.. అవినీతి చేయని నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఏడాదిలోపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే కేసీఆర్కు సంగారెడ్డిలో గుడి కట్టిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.