తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు 10 సీట్లు కేటాయించినట్టు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తెలిపారు. మంగళవారం చెన్నై లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పొత్తులో భాగంగా పుదుచ్చేరితో కలిపి కాంగ్రెస్ పార్టీ 10 సీట్టలో పోటీ చేస్తుందని, ఇతర భాగస్వామ్య పార్టీలు మరో 10 సీట్లలో పోటీ చేస్తాయని చెప్పారు. డీఎంకే తక్కిన 20 సీట్లలో పోటీ చేస్తుందన్నారు.
డీఎంకే, భాగస్వామ్య పార్టీలు ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే విషయమై మార్చి 7న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలుండగా, పుదుచ్చేరిలో ఒక లోక్సభ స్థానం ఉంది. స్టాలిన్ ప్రకటనకు ముందు సీపీఐ, డీఎంకే నేతల మధ్య లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఒప్పందం కుదిరింది. సీపీఐకి రెండు సీట్లు కేటాయించే ఒప్పందంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ముథరాసన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ మధ్య సంతకాలు చేశారు.