telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల అభివృద్ధి కోసం పోరాడుతా: కేసీఆర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ హజరయ్యారు. దళిత బంధు అమలుకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కేసీఆర్‌) దిశానిర్దేశం చేశారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళిత బంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, “నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా”నని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణం అని తెలిపారు. ఎన్నటి నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం, ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి వారి ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పట్టుపడితే తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం కేసీఆర్ అన్నారు.

రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించాం. గత వలస పాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకున్నది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాల‌ బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక్క‌ రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నాం. నేను ఎప్పటినుంచో అనుకుంటున్న దళిత అభివృధ్ది కార్యచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిద్ధిపేటలో దళిత చైతన్య జ్యోతి కార్యక్రమాన్ని చేపట్టి దళిత జాతి అభ్యున్నతి కోసం కృషి చేసిన. దళితబంధు గత సంవత్సరం మే నెల‌లోనే ప్రారంభమయ్యేది ఉండే, కానీ కరోనా కారణం చేత ఆలస్యమైంది అని కేసీఆర్ తెలిపారు.

Related posts