కరోనాను నియంత్రించేదుకు ఏపీ సర్కార్ పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సినిమా హాళ్లు, మాల్స్ ఈ నెల 31 వరకు మూసివేయాలని మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రెస్టారెంట్లు, బార్లకు సూచించామని తెలిపారు. పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఐటీ ఉద్యోగులు సాధ్యమైనంత వరకు వర్క్ఫ్రమ్ హోం చేయాలని సూచించారు. వ్యాపార సంస్థలు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీలో కేవలం రెండు కరోనా కేసులే ఉన్నాయని, కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. విజయవాడలో నోడల్ సెంటర్ను ఏర్పాటు చేశామని ఆళ్లనాని తెలిపారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో ల్యాబ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేయొద్దన్నారు. వైద్యరంగం భ్రష్టుపట్టిపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు.