వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ లో 31 కేసులున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి అనడానికి అఫిడవిట్ కేసులే నిదర్శనమని ఆయన అన్నారు. శనివారం ఎలక్షన్ మిషన్పై సీఎం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48 పేజీలలో 31 కేసులు జగన్ నేరచరిత్రకు రుజువులని అన్నారు.
దేశంలో ఎవరి అఫిడవిట్లోనూ ఇన్ని కేసులు ఉండవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిన్నాన్న హత్యలోనూ రాజకీయ లాభాలు చూడటం నీచాతినీచమని చెప్పారు. 31 కేసులతో హత్యారాజకీయాలు చేసేవారికి ఎవరైనా ఓటేస్తారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు దుయ్యబట్టారు.