ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు కూడా వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు టీడీపీ పట్టుబట్టగా అధికారపక్షం దీనికి అనుమతి నిరాకరించింది. దీంతో, స్పీకర్ తీరుపై టీడీపీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఎంత సేపు చర్చించినా తృప్తి చెందకపోతే ఏ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పలేదని అన్నారు.
సీనియర్ సభ్యులైన మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇతర సభ్యుల సమయాన్ని మీరు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి తాను అనుమతించనని, ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకోవద్దని సూచించారు. స్పీకర్ మాటలకు తృప్తి చెందని టీడీపీ సభ్యులు పోలవరం ప్రాజెక్టుపై చర్చకు పట్టుబడుతూనే ఉన్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.