ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతోంది. కౌంటింగ్ ప్రారంభమైన నుంచి వైసీపీ అదే దూకుడును ప్రదర్శించింది. 95 శాతానికిపైగా మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. అటు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి టీడీపీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తాడిపత్రి, మైదుకూరులో తప్ప టీడీపీ ఎక్కడ కూడా వైసీపీకి పోటీ ఇవ్వలేకపోయింది. అయితే.. తాజాగా ఏపీ మున్సిపల్ ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ విజయం కోసం కార్యకర్తలు చాలా కష్టపడ్డారని ఆయన పేర్కొన్నారు. బెదిరింపులతో వైసీపీ గెలించిందని రాబోయే ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ఆయన పేర్కొన్నారు. “తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలారా… స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం మీలో ప్రతిఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిచోట్ల ప్రాణాలు సైతం పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారు. మీ పోరాటస్ఫూర్తికి వందనాలు. ప్రస్తుత ఫలితాల విషయానికి వస్తే, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడాం. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదాం. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే.” అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.