ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న జకియా ఖానం ఎమ్మెల్సీ, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆమె తన రాజీనామా లేఖను వ్యక్తిగత సిబ్బంది ద్వారా శాసనమండలి కార్యాలయానికి పంపించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం 2020 జులైలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.
అనంతరం ఆమె శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా కూడా ఎన్నికయ్యారు. అయితే, దాదాపు రెండేళ్లుగా ఆమె వైసీపీ అధిష్ఠానం పట్ల అసంతృప్తితో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జకియా ఖానం తాజా రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల జాబితా మరింత పెరిగింది. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
గతంలో కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వంటి వారు పార్టీని వీడిన వారిలో ఉన్నారు.


రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండమైన సక్సెస్: అంబటి