telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే పులివెందుల రీపోలింగ్‌ను బహిష్కరించింది: బీటెక్ రవి

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ జడ్పీటీసీ ఉపఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

రీపోలింగ్ కోరిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు ఎన్నికల సంఘం ఆదేశించిన రెండు బూత్‌ల రీపోలింగ్‌ను బహిష్కరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఓటమి భయంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పారిపోతోందని తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి తీవ్రస్థాయిలో విమర్శించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.

“మొదట 15 బూత్‌లలో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పుడు ఎన్నికల సంఘం రెండు బూత్‌లలో రీపోలింగ్‌కు ఆదేశిస్తే, దానిని బహిష్కరిస్తున్నామని వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉంది.

ప్రజాస్వామ్యంపైనా, ప్రజలపైనా నమ్మకం ఉంటే ఈ రెండు బూత్‌లలో రీపోలింగ్ ను ఎందుకు అంగీకరించడం లేదు? ప్రజలు మీకు ఓటు వేయరని, మీరు ఓడిపోతారని స్పష్టంగా తెలియడం వల్లే ఈ బాయ్‌కాట్ డ్రామా ఆడుతున్నారు” అని బీటెక్ రవి ఆరోపించారు.

ఈ రెండు బూత్‌లలో ఎన్నికలు జరిగితే ఎలాగూ మళ్లీ రీపోలింగ్ రాదని, అలాంటప్పుడు పోటీ నుంచి ఎందుకు తప్పుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

ప్రజలు తమ వైపు లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక, వైఎస్సార్సీపీ ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.

ఇదే విషయంపై ఇతర టీడీపీ నేతలు మాట్లాడుతూ, ఇది వైఎస్సార్సీపీ ఆడుతున్న “డైవర్షన్ పాలిటిక్స్” అని ఆరోపించారు. పోలింగ్ రోజు సాయంత్రం ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత తమకు ఓట్లు పడలేదని నిర్ధారించుకుని, కావాలనే రీపోలింగ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు.

ఇప్పుడు తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘం, పోలీసులు, టీడీపీపై నెపం మోపుతున్నారని, రేపు మీడియాపైనా ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు.

Related posts