అమరావతి.. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు ముక్కుసూటిగా వెల్లడిస్తుంటారు. ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు. ట్వీట్టర్ వేదికగా పలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
అధికారంలో ఉన్నాన్ని రోజులు పొరుగు రాష్ట్రాల సీఎంలతో ఉప్పు-నిప్పులా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ, వాళ్లకు అడ్రస్సులే లేవని, మోదీ, అమిత్ షా వంటి నేతలు కూడా జూనియర్లేనని చంద్రబాబు హేళన చేసేవాడని చురకలు వేశారు విజయసాయిరెడ్డి. ఏపీకి జగన్ సీఎం అయ్యాకే, పక్క రాష్ట్రాలతో సుహృద్బావ వాతావరణం నెలకొందని ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో టీడీపీ నేతలు తమ ఉనికి కోసం పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
అంతకు ముందు దేవుడినీ వాడుకున్నారని, ఆ తర్వాత విగ్రహాలపై దాడులు అంటూ పబ్బం గడిపారని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యార్థులపై దాడులు అంటూ కట్టుకథలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. 1999లో ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పోస్తుల భర్తీ అవసరం లేదంటూ జీవో ఇచ్చి, వాటిని నిర్వీర్యం చేసిన ఘనుడే, ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు.” అంటూ ట్వీట్ చేశారు విజయ సాయి రెడ్డి.