ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 16 రోజులుగా రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రాజధాని రైతులు మలి దశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని తేల్చి చెప్పారు. రేపటి నుంచి సకల జనుల సమ్మెకు నిర్ణయం తీసుకున్నారు.
ఆసుపత్రులు, మందుల దుకాణాలు, పౌర సరఫరా తప్ప మిగతా అన్ని కార్యకలాపాలు బంద్ చేయాలని నిర్ణయించారు. రాజధానిలోని అన్ని గ్రామాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు తుమ్మల సత్య, పెందుర్తి శ్రీకాంత్ తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దీన్ని ప్రారంభించారు.