‘అమ్మా నాకు విశ్రాంతి కావాలి’ స్కూలు, కాలేజ్ చదువులతో అలసిన కూతురు తల్లితో చెప్పింది.
‘మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తరువాత విశ్రాంతేకదా బాగా చదువు’
కూతురు లేచి చదవటం మొదలు పెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలి పోయింది.
అమ్మ కొంచెం టైం ఇవ్వమ్మా విశ్రాంతి తీసుకుంటాను’ ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది.
‘ముందు పెండ్లి చేసుకోని సెటిల్ అవ్వు. తరువాత విశ్రాంతే’
‘ఇప్పుడే ఏం అవసరం అమ్మ. రెండు మూడేళ్ళుకాని……
సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా. ఆతర్వాత విశ్రాంతేగా. ‘
కూతురు పెండ్లికి సిధ్ధమయింది. విశ్రాంతి మాటేలేదు.
పెండ్లి అయింది. ఇద్దరు పిల్లల తల్లీ అయింది. విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలి పోయింది.
నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగ పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏవిధమైన ఇబ్బంది కలగకూడదు.
ఇంకోన్ని సంవత్సరాలు ఓపికపట్టు. అంతే, పిల్లలు పెద్దవాళ్ళయితే నీకు విశ్రాంతేకదా….. ‘
ఇద్దరు పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిచి పోయాయే కాని విశ్రాంతి దక్కనే లేదు.
పిల్లల హోంవర్కు, ప్రాజెక్టు వర్కు, లంచ్ బాక్సులు, ఆర్ధిక సమస్యలు, సంసారం వడిదుడుకులు ఊపిరి సలపని స్తితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమయింది.
‘ పిల్లలు చదువులయి ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బతుకుతున్నారు.
ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను’
ఇంక పిల్లల పెండ్లి చేయాలి.ఈ బాధ్యత తీరితే ఇంక హాయే కదా. నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు ‘
ఆమె ఓపిక చేసుకొంది. పిల్లల పెండ్లీ లోటు లేకుండ చేసింది. విశ్రాంతి లేక నీరసపడి పోయింది.
‘పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను.
అయ్యో రామా… అమ్మాయి కడుపుతో ఉంది. తొలి కాన్పు, పురుడు పోయాలి. నామకరణం వగైరా అన్నీ అయి అది కాపురానికి వెళ్ళిన తరువాత ఇంక విశ్రాంతే విశ్రాంతి’.
కూతురి బాలింత తనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి.
‘అబ్బ ఈ జంజాటం ముగిసింది. ఇంక విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే
అమ్మా నేను ఉద్యోగానికి వెళతాను. నీవు మనవడిని చూసుకోవాలి’ అని కూతురి ఆకాంక్ష.
తప్పదు మనవడి సంరక్షణ లో ఆడుతూ పరుగులు తీస్తూ గువ్వయి పోయింది.
మనవడు పెద్దవాడు అయినాడు. వాడి పన్లు వాడు చూసుకుంటున్నాడు. తన అవసరం లేదు. ఇంక విశ్రాంతి తీసికోవచ్చు అనుకునే లోపు
ఏమే వినిపిస్తున్నదా నా మోకాళ్ళ నొప్పి ఎక్కువయిందే లేవటానికి కష్టంగా ఉంది. బిపీ గాని ఎక్కువయిందేమో. షుగర్ కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగ ఉండమన్నారు డాక్టరు గారు.
పతి సేవతో అంతోఇంతో ఉన్న ఆశక్తి కూడ కరిగి పోయింది. శరీరం తోలు తిత్తి అయింది. విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది.
ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగి వచ్చి విశ్రాంతి తీసుకుందువుగాని రామ్మా అని పిలిచాడు.
ఆమె రెండు చేతులూ జోడించి ఆనంద భాష్పాలతో సన్నద్దురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది.
అవిశ్రాంత నారీమణులందరికీ అంకితం.