ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇటీవల ‘ఖైదీ’ చిత్రంతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. ఎక్స్ బి ఫిలిమ్ క్రియేటర్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుండగా ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్, రీరికార్డింగ్, డబ్బింగ్ పూర్తయి తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ తొమ్మిదిన ఈ చిత్రం విడుదల కావాల్సి వుండగా లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో రిలీజ్ కాలేక పోయింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ముగిసిన వెంటనే థియేటర్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత జేవియర్ బిరిటో ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సహా అన్ని ఓటీటీ సంస్థలు ‘మాస్టర్’ చిత్రాన్ని కొనేందుకు పోటీపడుతున్నాయి. గత రెండు రోజులుగా ఈ చిత్రాన్ని కొనేందుకు ఓటీటీ సంస్థలు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల దాకా ఆఫర్లు ప్రకటించాయి. ఈ బంపర్ ఆఫర్కు ‘మాస్టర్’ చిత్రనిర్మాణ సంస్థ అంగీకరిస్తుందని కోలీవుడ్ అంతటా పుకార్లు బయల్దేరాయి. ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాత పదే పదే చెబుతున్నప్పటికీ, ఓటీటీ సంస్థలు చిత్రం కొనుగోలుకు విపరీతంగా పోటీపడుతున్నాయి.
previous post
next post