తిరుమల వీఐపీ దర్శనాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న తిరుమలకు వచ్చిన ఆయన ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వెంకయ్యనాయుడికి స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ
ప్రముఖులు, వీఐపీలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఉపరాష్ట్రపతి అన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండాలంటే ప్రముఖులు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు వస్తే బాగుంటుందన్నారు. స్వామిని దర్శించుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందన్నారు. అవినీతి, అసమానతలు, ఘర్షణలు, ఆకలిదప్పికలు లేని సమాజాన్ని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.