telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఇదే…

ప్రతి యేటా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి… వాటిలో అతిపవిత్రం వైకుంఠ ఏకాదశి…. దీనినే ముక్కోటి ఏకాదశి అనీ అంటారు… ఈ రోజునే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి గీతాబోధ చేశారనీ ప్రతీతి… అందుకే ఈ ఏకాదశిన గీతాజయంతిని జరుపుకోవడం ఆచారం… శ్రీమన్నారాయణుని లీలావినోదంతోనే సకల చరాచరసృష్టి సాగుతోంది… ధర్మసంస్థాపన కోసం శ్రీమహావిష్ణువు అనేక అవతారాలెత్తాడు… ధర్మాన్ని నిలిపాడు… శ్రీకృష్ణావతారంలో లోకానికి గీతనూ బోధించాడు… ఆ బోధలు ఈ నాటికీ భక్తకోటిని పావనం చేస్తూనే ఉన్నాయి… భగవద్గీత పరమపవిత్రం… గీతాపారాయణ పఠితులను పవిత్రులను చేయక మానదు… మానవజీవనం ధర్మమార్గంలో సాగడానికి పలు సూత్రాలను శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధించాడు. కురుపాండవ సమరం ఆరంభ సమయాన అర్జునునికి శ్రీకృష్ణుడు చేసిన బోధనే గీత. బంధుమిత్రాదులను చంపి, వారి రక్తతర్పణంతో సిద్ధించే రాజ్యం వలదని అస్త్రసన్యాసం చేశాడు అర్జునుడు. ఆ సమయంలో పరమాత్మ పార్థునికి చేసిన బోధనే భగవద్గీతగా భాసిల్లుతోంది…

యుద్ధం చేయనని అహింసా మార్గాన్ని ఎంచుకున్న అర్జునునికి శ్రీకృష్ణుడు హింస చేయమని బోధిస్తాడా? అని పలువురు మూర్ఖులు ప్రశ్నిస్తున్న రోజులివి. కానీ, కృష్ణ పరమాత్మ తత్త్వం తెలియని మూఢులు ఆ తీరున మాట్లాడవచ్చు. అంతర్ దృష్టితో గమనిస్తే పరమాత్మ ఎందుకు ఆ రణభూమినే ఎంచుకొని గీతను బోధించాడో అర్థమవుతుంది. ఆత్మ సత్యం. అది నిత్యం. దానికి చావు లేదు. ఓ తనువు నుండి మరో తనువుకు మారుతుందే తప్ప మరణం పొందదు. తనువుతో అవతరించిన ప్రతీజీవి మంచి,చెడులతో జీవనం సాగించవలసిందే. జీవన పోరాటం జరుపవలసిందే. ఆ పోరాటాన్ని మధ్యలో వదిలివేస్తే జన్మకు సార్థకత సిద్ధించదు. సత్యమైన ఆత్మ ప్రస్తుత శరీరాన్ని వీడేంత వరకు పోరాడాల్సిందే. అదే అసలు రహస్యం. అసలు సత్యాన్ని బోధించడానికే పరమాత్మ పవిత్ర స్థలమైన కురుక్షేత్రాన్ని ఎంచుకున్నాడు. మంచిచెడ్డలకు ప్రతీకలుగా కురుపాండవులను చూపించాడు. మంచిని గ్రహించి, చెడును వీడవలెనని బోధించాడు. అందుకు జీవన పోరాటం చేస్తూనే ఉండాలన్న సత్యాన్ని మానవాళికి అందించాడు. ఆ సత్యాన్ని గ్రహించని వారే వింతవాదనలు చేస్తూ పరమపవిత్రమైన గీతను విమర్శిస్తూంటారు. అలాంటి వారు సైతం భగవద్గీతను పదే పదే పఠించినట్టయితే, పరమాత్మ తత్త్వం బోధ పడుతుంది. అసలైన జీవం ఏమిటో అర్థమవుతుంది. మన కనులకు అసలైన వెలుగు ఏమిటో అవగతమవుతుంది.

దేవదేవుని మాయతోనే మనిషికి కష్టసుఖాలు… ఆ మాయను ఛేదించే మార్గమే భగవద్గీత… దర్మాచరణకు సులువైన దారి… అదే లోకానికి బోధించాడు మురారి… ఆయన తత్త్వం తెలుసుకున్నవారికి అనునిత్యం ఆనందమే… ధర్మం నశించిన ప్రతీసారి పరమాత్మ ఓ అవతారమెత్తి, ధర్మసంస్థాపన చేశాడు… ఆయన నెలకొల్పిన ధర్మాన్ని ప్రతి మనిషి పాటించినట్లయితే, ధర్మం నాలుగు పాదాల మీదే నడుస్తూ ఉంటుంది.. సకలం మాకే కావాలనుకొనే స్వార్థమానవుల కారణంగానే అధర్మం తాండవిస్తుంది… అందుకు ప్రతీక దుర్యోధనాదులు. మాట కోసం కట్టుబడి వనవాసం, అజ్ఞాత వాసం చేసిన పాండవులు ధర్మనిరతులు. ఈ మంచిచెడ్డలకు మధ్య పోరాటమే కురుక్షేత్రం. ఇదే విషయాన్ని ఎవరికి వారు తమ జీవితాలకు అన్వయించుకుంటే ధర్మమే నిలుస్తుందని పరమాత్మ బోధ చేశాడు. అదే భగవద్గీత సారాంశం. అర్జునునికి కలిగిన విచారం లాగే ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక రోజు మాయాచిత్తుడై ఏది పుణ్యమో, ఏది పాపమో తెలియని తికమకలో పడతాడు. అలాంటి వారికి కృష్ణ పరమాత్మ ఒకే ఒక సత్యాన్ని బోధించాడు. అన్ని ధర్మములూ వదలి, ఆ పరమాత్మనే నమ్ముకుంటే అసలైన ధర్మమేదో గోచరిస్తుంది. అప్పుడే ఏది తప్పో, ఏది ఒప్పో తేలిపోతుంది. ఆ జ్ఞానం సంపాదించేందుకు సులువైన మార్గం భగవద్గీతను అర్థం చేసుకోవడమే…
నారాయణ లీల నవరసభరితంగా ఉంటుంది. ఆ లీలను తెలుసుకొన్నవారి జీవితం పావనం. భీష్మాదులు, విధురుడు, అక్రూరుడు మొదలైన భక్త శిఖామణులు మానుషరూపంలో ఉన్న శ్రీకృష్ణుడే పరమాత్మ అన్న సత్యాన్ని గ్రహించారు. అందుకే అభిమానించారు. ఆరాధించారు. ఆ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆ దివ్యమోహన రూపాన్ని దర్శించుకోలిగారు. పరమపావనులకే పరమాత్మ కటాక్షం ఉంటుందని ఊరుకోరాదు. నిజానికి పరమాత్మ మన నుండి కోరేది నిండుమనసే. అందుకే నిండుమనసే నీ పూజ… అనీ కీర్తనలు వెలిశాయి. భక్తితో ఏమిచ్చినా తీసుకొని సంతృప్తి చెందే భక్తసులభుడు పరమాత్మ. ఫలం, పత్రం, పుష్పం, తోయం ఏమిచ్చినా స్వీకరిస్తానని భగవానుడు గీతలో బోధించాడు. అదే తీరున కృష్ణమూర్తి సాగాడు. ఆ లీలలు తలచినంతనే మది పులకించిపోవలసిందే. ఏకాదశులందు వైకుంఠ ఏకాదశి వేరయా – అన్నారు పెద్దలు… ఏకాదశి విష్ణువు, శివుడు ఇద్దరికీ ప్రియమైనది… అందుకే ఈ తిథి వైష్ణవులకు, శైవులకు పరమపవిత్రం… ఈ పవిత్ర దినాన భగవద్గీత పారాయణమూ పుణ్యప్రాప్తి ప్రసాదిస్తుంది. ఏకాదశి పూట ఎందరో భక్తులు ఉపవాస దీక్ష పాటించడం ఈ నాటికీ గమనిస్తున్నాం. ప్రతి నెలలోనూ శుక్ల పక్షంలో ఓ ఏకాదశి, కృష్ణ పక్షంలో మరో ఏకాదశి ఉంటాయి. అలా నెలకు రెండు ఏకాదశుల చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు… వాటిలో ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలసి భక్తులను ఆశీర్వదిస్తారని ప్రతీతి. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అనీ పిలవడం పరిపాటి. ఈ రోజునే అమృతం, విషం రెండూ పుట్టాయనీ పురాణాలు చెబుతున్నాయి. సత్యకాలం నుంచీ వైకుంఠ ఏకాదశి పవిత్రత కొనసాగుతోంది. మందరపర్వమథనంలో ఉద్భవించిన విషాన్ని శివుడు గళంలో నిలిపాడు. ఏకాదశి రోజునే వెలసిన సుధను రాక్షస మూకలకు అందకుండా మోహినీ రూపధారియై మాయచేశాడు. అమృతాన్ని దేవతలకు దక్కేలా చేశాడు విష్ణువు … ఆ కథను మననం చేసుకున్నా జన్మ పావనమవుతుంది…

ధనుర్మాస ఏకాదశి రోజునే ధనుర్ధారులై సమరానికి సన్నద్ధమయ్యారు కురుపాండవులు. పలు యాగాలు చూసిన పుణ్యస్థలమైన కురుక్షేత్రాన్ని సమరభూమిగా ఎంచుకున్నారు. అక్కడ ఓడినవారికి, గెలిచిన వారికి కూడా పుణ్యఫలమే దక్కుతుంది. అలాగే ఆ చోట మరణించిన వారికీ, విజేతలకూ స్వర్గప్రాప్తి తథ్యం. ఈ విషయాలన్నీ తెలిసే కురుక్షేత్రాన్ని రణక్షేత్రంగా ఎంపిక చేశారు. ఆ ధర్మక్షేత్ర మహిమ తెలిసిన భీష్మాదులు కౌరవులకు అలాగైనా పుణ్యలోకప్రాప్తి లభిస్తుందని ఆశించే యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇన్ని కోణాల్లో ఆలోచిస్తే మన మనసును మించిన కురుక్షేత్రం ఏదీ ఉండదని తేలిపోతుంది. అప్పుడే భగవదనుగ్రహం లభిస్తుంది. అది తెలుసుకున్న పార్థునికి అనితరసాధ్యమైన విశ్వరూప సందర్శన ప్రాప్తి కలిగింది. అంటే, భగవత్ లీల తెలిసిన వారికి పరమానందం కలుగుతుందని భావం. గీతాసారం మనకు బోధపడితే, ప్రతి అణువులోనూ పరమాత్మనే ఉన్నాడన్న సత్యం గ్రహిస్తాం. అణువూ అణువున పరంధాముడున్నాడన్న పరమసత్యం తెలియడమే అసలు సిసలు జ్ఞానం. అందుకు మార్గం చూపించేదే భగవద్గీత. వైకుంఠ ఏకాదశిన గీతాజయంతిని సైతం జరుపుకుంటూ పరమాత్మ తత్త్వం తెలిసిన వారికి ఇహంలోనే పరం లభిస్తుందనీ చెప్పవచ్చు. . కావున భక్తజనులు పరమపావనమైన గీతను పవిత్ర దినమైన వైకుంఠ ఏకాదశిన పఠనం చేసినా, మననం చేసుకున్నా, ఆ లీలామూర్తి లీలలు తలచుకున్నా మన జన్మలు పావనం కాకమానవు. యుగయుగాలుగా తరతరాలుగా గీత మన జీవనవిధానంలో భాగమయింది. గీతా పఠనంతోనూ, గీతాధ్యానంతోనూ సకల సుఖాలు మన సొంతమవుతాయి. భయంకరవ్యాధులు తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో భగవద్గీతనే మనకు రక్ష… గీతను సదా స్మరిద్దాం… తరిద్దాం… గీతను పఠిద్దాం… గీతను సదా స్మరిద్దాం… గీతతోనే తరిద్దాం… భగవద్గీతను మన జీవితంలో భాగంగా చేసుకుందాం… ఓం తత్ సత్…

Related posts