బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు చేదు అనుభవం ఎదురయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు, పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బయటకు లాక్కెళ్లారు.
కాగా, జీవీఎల్ పై చెప్పు విసిరిన వ్యక్తిని యూపీలోని కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవగా పోలీసులు గుర్తించారు. ఇతడిని పోలీసులు ఢిల్లీలోని కమలానగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. జీవీఎల్ ప్రస్తుతం రాజ్యసభకు యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండేవారితో జీవీఎల్ కు ఏమైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.