అమ్మ భాషతోనే అభివృద్ధి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాతృభాషల ప్రాధాన్యాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఐక్య రాజ్య సమితి కూడా మాతృభాషల ప్రాధాన్యాన్ని గుర్తించిందని తెలిపారు. అందుకే ఈ ఏడాదిని ‘అంతర్జాతీయ మాతృభాషల సంవత్సరం’గా ప్రకటించిందని మోదీ గుర్తు చేశారు.
ఉత్తరాఖండ్లోని దారుచులా ప్రాంతంలో రంగ్ జాతి ప్రజలు లిపి లేని తమ భాష ‘రంగ్లో’ను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. పదివేల వరకు ఉండే ఆ జాతి ప్రజలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ భాషాభివృద్ధికి పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఎవరి భాషను వారు, వారి యాసతో ఉపయోగించడం ప్రారంభించాలని మోదీ సూచించారు. ఎంత అభివృద్ధిని సాధించినా మాతృభాషను విస్మరిస్తే దానికి అర్థం ఉండదని మోదీ పేర్కొన్నారు.